నేత్రా అవధానం Dr Visalakshi

నేత్రావధానం గురించి కొన్ని ప్రాధమిక వివరాలు :

మౌనంగా కేవలం కళ్ల సైగలతోనే సాగుతుంది. వేదికపై ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుంటారు. ప్రేక్షకులెవరైనా ఒక పదమో, వాక్యమో కాగితంపై రాసి అవధానుల్లో ఒకరికి ఇస్తారు. దానిని అందుకున్నవారు తమ కళ్లతో సంకేతాల ద్వారా అభినయిస్తూంటే మరొకరు వాటిని అర్థం చేసుకుని అక్షరీకరిస్తారు. ఇదెలా సాధ్యమంటే ఒక్కొక్క అక్షరానికి కనుల భాషలో ఒక సంకేతముంటుంది. అక్షరానికి ఒత్తులు, గుణింతాలు ఉంటే మరి కొన్ని భంగిమలుంటాయి. విరామ చిహ్నాలకు కూడా కొన్ని సంకేతాలుంటాయి. పృచ్ఛకులు కాగితంపై ఏది రాసిస్తారో జిరాక్స్ తీసినటుగ్లా అవధాని తన కాగితంపై అదే రాయడం ఆ కనుల సైగల ద్వారానే సాధ్యం. దాన్నే నేత్రావధానమంటారు. మరో విశేషం కూడా ఉంది. అదేమంటే – పృచ్ఛకులు గనక అక్షరాలు తప్పుగా రాస్తే అవధాని అక్షరానువాదంలో సైతం అవే తప్పులు రావడమనేది అవధానం కచ్చితత్వానికి నిదర్శనం. అవధానుల్లో ఎవరికే సందేహం వచ్చినా దాన్ని వారు కళ్లతోనే ప్రశ్నించుకుంటారు తప్ప నోరు మెదపరు.

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలంలోని సీసీసీ సింగరేణి ఉన్నత పాఠశాలలో సీనియర్‌ తెలుగు పండితురాలిగా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రమాకుమారి, కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ బాపులపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డాక్టరు నిడమర్తి లలితాకామేశ్వరిలు చిన్ననాటి స్నేహితులు. పదో తరగతి వరకు కలిసి చదువుకున్న వీరు తెలుగు భాషపై మక్కువతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ ప్రాచ్య(ఓరియంటల్‌) కళాశాలలో భాషా ప్రవీణలో చేరారు. అదే సమయంలో అక్కడ అధ్యాపకులుగా పనిచేస్తున్న చిర్రావూరి శివరామకృష్ణ శర్మ ఈ కళకు బీజం వేశారు. ఆయన పాఠం బోధిస్తుండగా పట్టించుకోకుండా మిత్రద్వయం కళ్లతో సైగలు చేసుకోవడం చూసి ఆగ్రహించారు. మర్నాటికల్లా 500 పద్యాలు అప్పజెప్పాలని శివరామకృష్ణ ఆదేశించారు. స్నేహితురాళ్లు పట్టుదలగా చదివి మర్నాడు చూడకుండా 500 పద్యాలను తడబడకుండా అప్పజెప్పారు. వీరి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని మెచ్చుకుని ఆయన మీకు నేత్రావధానం నేర్పిస్తాను, నేర్చుకుంటారా? అని అడిగారు. దీనికి వీరిద్దరూ సరే అన్నారు. ఏడాదిపాటు సాధన చేశారు.

Comments