Who is paśuvu-paśupati by Dr viśālākṣi



పశువు, పశుపతి  - పదాల విశిష్టత ఏమిటి ? వివరించమని  అడిగారు.

🙏🌹
" పాశ బద్ధః పశుః " అన్నారు. కాల పాశము  చేత, కర్మపాశము చేత బద్ధులైనవారు పశువులు. కాలపాశము, కర్మ పాశము ఎవరి వశంలో  ఉంటాయో వారు పశుపతి.
" పశూన్ పాతి రమతే పునః తేషామధివసతి పాతి ఇతి పశుపతిః " - పశువులను సృష్టించి, వారితో ఆడుకుంటాడు, ఆనందిస్తాడు, వారి యందు నివసిస్తాడు, వారిని రక్షిస్తాడు కనుక మహేశ్వరుడు పశుపతి.
"సర్వథా యః పశూన్ పాతి ఇతి పశుపతిః" అన్ని విధాలుగా పశువులను కాపాడేవాడు పశుపతి. ' పశుపాశ విమోచనుడు ' అని ఈశ్వరుడినీ, 'పశుపాశ విమోచనీ ' అని అమ్మవారిని అంటాము.

" ప్రథమోహ్యేష దేవానాం, తం దేవానాం పరమం చ దైవతమ్ " అనేది వేద ప్రమాణం కనుక దేవదేవుడు మహాదేవుడు శివుడు. ఆ శివుని సహస్ర నామాలలో "పశుపతి " నామం ఒకటి. ఈ పేరుతో ఉన్న 'పశుపతినాథ్ ఆలయం' నేపాల్ లో ఉన్నది. దైవ నామాలలో కొన్ని దైవ మహత్వాన్ని, విభుత్వాన్ని చూపించేవి అవుతాయి. కొన్ని నామాలు దైవము చేసిన పనుల వల్ల, అనగా చూపించిన లీలల వల్ల ఆ పేర్లు వస్తాయి. శంభుః, శివః మొదలైనవి పరమేశ్వరుని విభుత్వాన్ని తెలియజేసే నామాలు. ఈశ్వరుడు చేసిన త్రిపురాసుర సంహారం కార్యం - లీల వలన త్రిపురాంతకుడు, త్రిపురహరుడనే నామం వచ్చింది. పశుపతి నామం ఈశ్వరుని మహత్వాన్ని తెలియజేస్తోంది.

జీవులమందరమూ కాల పాశానికి బద్ధులము, కర్మ పాశానికి బద్ధులము. కాల బద్ధులైన, కర్మ బద్ధులైన  వారందరూ పశువులే ! ఎవరు ప్రకృతికి అధీనులై ఉంటారో వారు పశువులు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరూ కాల బద్ధులు. ఎవరి ఆయుః ప్రమాణం తీరగానే వారు వెళ్ళి పోవలసిందే ! పశువులు పాశము ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుందో, ఆయన పశుపతి. కాలబద్ధులైన జీవులను వారి ఆయుః ప్రమాణం తీరగానే కాలపాశం వేసి, ఆ జీవుడిని లాగి  యమధర్మరాజు తీసుకుని వెళ్ళి పోతాడు. అటువంటి యముని పాశాన్ని కూడా నిగ్రహించగలిగిన పశుపతి పరమేశ్వరుడు. నిగ్రహానుగ్రహ సమర్ధుడు.
అనన్య భక్తితో తనను ఆశ్రయించిన భక్త మార్కండేయుని ప్రాణాలను తియ్యటానికి పాశం వేసిన యముని కాలపాశాన్ని నిగ్రహించిన కాలకాలుడు పశుపతి. పశుపతి దగ్గర ఉన్న అస్త్రము పాశుపతాస్త్రము.
పశువు, పాశము, పశుపతి - ఈ మూడు పదాల అర్ధము తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము. ఈ మూడింటి జ్ఞానము ఎవరికి ఉంటుందో వారు కాలపాశం నుంచి విముక్తులవుతారు.  పాశము అంటే పశువులను బంధించే తాడు. పశుపతి యొక్క జ్ఞానమును పాశుపతము అంటారు. ఎవరు పశుపతి జ్ఞానం కలిగి ఉంటారో, అంటే పాశుపతమును ఆరాధిస్తారో, వారిని పశుపతి పశుపాశ బంధం నుంచి విముక్తులను చేస్తాడు. పాశంలో  తగుల్కొన్నవాడు జీవుడు. ఏ జీవుడు పాశ విముక్తుడవుతాడో, అతడు శివుడవుతాడు. అంటే, పశుపతి అనుగ్రహంతో పశుపాశం నుంచి విడుదల పొందిన జీవుడు పరమేశ్వరునిలో ఐక్యమవుతాడు. తానే శివుడవుతాడు. జీవుల కర్మల ననుసరించి వారికి ఉపాధులు లభిస్తాయి. ఉపాధులతో కర్మలు చేస్తారు. కర్మ ఫలాల ననుభవిస్తుంటారు.
'పశుం మాం పాలయ ప్రభో ' అని ప్రార్ధించాలి. ఆయన పశుపతి కనుక, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కనుక మనలను పాలించ గలడు. లౌకికమైన పశు పాలకులు పశువులను కాస్తారు, రక్షిస్తారు, ఆవసరాలు తీరుస్తారు కానీ, జీవికి కావలసినవన్నీ ఇవ్వలేరు.  పశుపతి అయిన పరమాత్మ రక్షించటము, అవసరాలు తీర్చటమే కాదు, అనాది అవిద్యను నశింపజేసి, నిశ్శ్రేయస్సును కూడా అనుగ్రహించ గలడు.

అర్జునుడు పాశుపతాస్త్రము పొందటం కోసం ఈశ్వరుడిని గురించి తపస్సు చేయగా, ఈశ్వరుడు కిరాత రూపంలో వచ్చి, అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేసి, అతని పరాక్రమాన్ని పరీక్షించి, పాశుపతాస్త్రాన్ని ఉపదేశించాడు. ' 'పాశుపతాస్త్రోపదేశముం జేసెద పరుల గెల్వుము ప్రతాపంబుమీర ...' అని అనుగ్రహించాడు.
అర్జునుడు పాశుపతాస్త్రమును సంపాదించుకున్నాడే కానీ కురుక్షేత్ర యుద్ధంలో దాన్ని ప్రయోగించలేదు. జగన్మాత మటుకు భండాసురాది రాక్షస సంహార సమయంలో మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి, రాక్షస సంహారం చేసింది.
' మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా.'

శ్రీకృష్ణ పరబ్రహ్మ మహేశ్వరుని తత్త్వాన్ని గురించి తెలుసుకోవటానికి, ఈశ్వర మంత్రోపదేశం పొందటానికి వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, ఆయన దగ్గరి నుంచి సంపూర్ణ శివతత్త్వాన్ని గ్రహించి, పశు, పాశ, పతి గురించి విస్తారంగా తెలుసుకున్నాడు. అనన్య అచంచల అఖండ అవ్యభిచారిణీ నైష్ఠికీ భక్తి కలిగిన ఉపమన్యువును శివపార్వతులు తమ కుమారునిగా ఆదరించి అనుగ్రహించారు. అటువంటి భక్తి, నిష్ఠ మనలో ఉంటే, మనం కూడా ఈశ్వరుని సంపూర్ణ కటాక్షాన్ని పొందగలము.

మనమే పరమాత్మ స్వరూపులమైనా, మన శరీరమంతటా పరమాత్మ చైతన్యమే ప్రసరిస్తూ ఉన్నా, మన హృదయంలోనే పరమాత్మ కొలువై ఉన్నా, మనకు ఆ పరమాత్మ ఉనికిని గ్రహించగల జ్ఞానం కలిగే దాకా శాస్త్రోక్త విధానంలో సాధన చెయ్యాలి. ఆ సాధన జపము, తపము, అర్చన, హోమము, శ్రవణము, కీర్తనము, మననము లాంటి అనేక పద్ధతులలో ఏ పద్ధతిలోనైనా కావచ్చును. అన్నీ కూడా కావచ్చును. ప్రాణాయామము చేస్తూ, శ్వాసతో మంత్ర నామాన్ని, దైవ నామాన్ని అనుసంధానం చెయ్యవచ్చును.
మనం ఉచ్ఛ్వాసతో - అంటే గాలి పీల్చేటప్పుడు పరమేశ్వరుని స్మరిస్తూ "నీవు పశుపతివి" అనీ, నిశ్శ్వాసలో - అంటే గాలి వదిలి పెట్టేటప్పుడు " నేను పశువును" అని అంటూ  చెయ్యటం వలన అది పశుపాశవిమోచనను కలిగించే మహాశక్తిమంతమైన మంత్రంలా మారి మనలను ఉద్ధరిస్తుంది. మనం గాలి పీల్చేటప్పుడు "నీవు పశుపతివి, నిన్ను నాలోనికి తీసుకుంటున్నాను" అంటూ, విశ్వమంతా నిండి ఉన్న వాయుస్వరూపుడైన ఈశ్వర శక్తిని పశుపతిగా భావన చేస్తూ లోపలికి తీసుకుంటున్నాము. అప్పుడు విశ్వాత్ముడైన పరమేశ్వర శక్తి మనలో ప్రవేశించి, మన శరీరములోని ప్రతి అణువు శివశక్తి భరితమవుతుంది. మనం గాలి వదిలేటప్పుడు, మన నిశ్శ్వాసతో మనలో ఉన్న పశుతత్త్వమును "నేను పశువును, పశుత్త్వాన్ని వదిలేస్తున్నాను" అని భావిస్తూ బైటికి వదిలేస్తే, క్రమక్రమంగా మనలోని పశులక్షణాలైన అజ్ఞానము, తంద్రత, సోమరితనము, కామక్రోధాది దుర్గుణాలు అన్నీ నెమ్మది నెమ్మదిగా మనలోనుంచి బైటకు వెళ్ళిపోతాయి. ఈ విధమైన సాధన వలన పశువు యొక్క పాశాలు తెగిపోయి, పశువు పశుపతిగా మారిపోతుంది. అదే " అహం బ్రహ్మా2స్మి" అనుభవం.

🙏🌹
డా.విశాలాక్షి

Comments