ఎవ్వరికీ పూర్తిగా అర్ధంకాని అంబేద్కర్- By Vaadiyala Ranjith Kumar

ఎవ్వరికీ పూర్తిగా అర్ధంకాని అంబేద్కర్

నేను ఒక రోజు నా స్నేహితుడి సైకిల్ మీద కాలేజీ కి వెళ్ళాను. ఆ కీ చైన్ మీద అంబేద్కర్ గారి బొమ్మ ఉంది. అది చూసిన నా స్నేహితుడొకడు, "అదేంట్రా నువ్వు అంబేద్కర్ బొమ్మ కీచైన్ తెచ్చావ్?", అన్నాడు. వాడు ఎందుకు అలా అన్నాడో నాకు అప్పుడు తెలియదు. అది నాది కాదు నా స్నేహితుడిది అని చెప్పా. తరవాత వాడితో జరిగిన చర్చలో నాకు అంబేద్కర్ గారిని కేవలం దళితుల నాయకుడిగా చూస్తారని, రిసర్వేషన్లకి ఆయనే కారణం అన్న కారణంగా కొందరు 'అగ్ర కులాల' వారికి ఆయన మీద కోపం అని కూడా అర్ధమయ్యింది. ఆయన స్వతంత్ర సంగ్రామం లో ఫాల్గోన లేదు అని కూడా ఆయనని విమర్శించే వారు ఉన్నారు. నాకు అర్ధమైనంత వరకూ ఆయనని దేవుడిని చేసిన వారికి గానీ, ఆయనని ఇష్టపడని వారికి గానీ ఆయన పూర్తిగా అర్ధం కాలేదు

[నా దృష్టిలో ఏ కులం గొప్పదీ కాదు, ఏ కులం తక్కువది కాదు. అయినా సరే ఇంకో విదంగా సంబోధించడం ఎలానో తెలియక అగ్ర కులం అని అంటున్నాను. గమనించగలరు]

ముందుగా అంబేద్కర్ గారిని తమ నాయకుడిగా భావిస్తున్న వారి సంగతి చూద్దాం

అంబేద్కర్ గారి పట్ల ప్రేమని అలానే అగ్ర కులాల పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్న వారిలో చాలా మంది క్రైస్తవులుగా మతం మార్చు కుంటున్నారు. ఎన్ని వత్తిడులు వచ్చినా ఆయన క్రైస్తవాన్ని స్వీకరించలేదు అనే విషయాన్ని అటువంటి వారు గమనించాలి. అంతే కాక క్రైస్తవం వలన దేశానికి ప్రమాదం అని కూడా ఆయన చెప్పారు. ఈ రోజు అదే జరుగుతోంది. ఈ రోజు ఒక సమాజం, దేశం తీసుకొనే నిర్ణయాల ప్రభావం 50 - 100 – 200 ఏళ్ళ తరువాత ఎలా ఉంటుందో ముందుగా ఊహించగాలడం ఒక మేధావి లక్షణం. క్రైస్తవం, ఇస్లాం లాంటి విదేశీ మతాల వలన ప్రమాదాలను ఆయన ముందుగానే గుర్తించారు కాబట్టే మన దేశంలో పుట్టిన మతమైన భౌద్ధం లోకి మారి, మతం మారాలి అనుకునే దళితులని బౌద్ధంలోకి మారమని స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా క్రైస్తవ మిషనరీలు సేవ వేనక నిజమైన కారణం మత మార్పిడులే అని కూడా స్పష్టంగా చెప్పారు [1]. అంబేద్కర్ గారిని గౌరవించే, ఆరాధించే వ్యక్తులు ఆయన వద్దన్న, దేశానికి ప్రమాదకరం అని తేల్చిన క్రైస్తవంలోకి ఎలా మతం మారుతున్నారు? అటువంటి వారు ఈ విషయం ఒక సారి ఆలోచించుకోవాలి.

అంతే కాక అంబేద్కర్ గారికి ఆ పేరిచ్చిన ఆయన గురువు గారు ఒక బ్రాహ్మణుడు, విదేశాలలో ఆయన చదువుకి సహాయం చేసిన వ్యక్తి ఒక క్షత్రియుడు. ఆయన నిరసించింది హిందూ సమాజం లో ఉన్న కుల వివక్షనే కానీ హిందూ ధర్మాన్ని కాదు. ఉపనిషత్తులని కూడా ఆయన అధ్యయనం చేశారు. ఉపనిషత్తులలో భాగమైన మహా వాఖ్యాలని ప్రజాస్వామ్యానికి నిజమైన, సహజమైన పునాదిగా ఆయన భావించారు. మనమందరం ఆ ఈస్వరుడిలో (బ్రహ్మము) అంతర్భాగమే అనే ఈ సూత్రాలు సహజంగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలచే పాటింపచేస్తాయని ఆయన చెప్పారు

ఇక రెండో వర్గం సంగతి చూద్దాం. ముందే చెప్పినట్లు వీరు అంబేద్కర్ గారిని కేవలం ఒక దళితు నాయకుడిగా మాత్రమే చూస్తారు. ఆయన జీవితంలో ఎక్కువ భాగం దళితుల కోసమే పోరాడారు అనేది నిజమే అయినా, ఆయనని కేవలం దానికే పరిమితం చెయ్యడం తప్పే అవుతుంది. అదీ కాక దళితులు ఆరోజుల్లో అనుభవించిన వివక్షని సమాజం నుండి పోగొట్టడానికి ప్రయత్నించడం స్వతంత్ర సాధన అంత కాకపోయినా తక్కువ పనేం కాదు. ఆ విషయం లో ఆయన కృషిని అందరూ మనఃస్పూర్తిగా మెచ్చుకోవాల్సిందే. ఆయనని కేవలం దళితుల నాయకుడిగా అప్పటి దేశ నాయకులు చూడలేదు. అందుకనే దేశానికి అతి ముఖ్యమైన రాజ్యాంగ రచన బాధ్యతలని ఆయనని అప్పగించారు. అంతటి కీలకమైన బాధ్యతని ఆయనకి అప్పజెప్పిన నాయకత్వం యొక్క విశాల దృక్పదాన్ని దళితులు గమనించాలి

క్రైస్తవం గురించి ఆయన అభిప్రాయాన్ని ముందే చెప్పుకున్నాం. ఆయన దార్శనికత ఇంకా ఎన్నో విషయాలలో కనబడుతుంది. అప్పటి నాయకత్వం అంబేద్కర్ గారి మాట విని ఉంటే మన దేశం ఈ రోజు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ఉండేవి కావు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1.      జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దాని రచనలో కూడా ఆయన ఫల్గోనలేదు.
2.      రిసర్వేషన్ల కి అయిష్టంగా ఒప్పుకున్నారు. రిసర్వేషన్లు కేవలం 10 సం. లు మాత్రమే ఉండాలి అని కోరుకున్నారు [2]. రిసర్వేషన్ల వల్ల దళితులకి మేలు జరిగేది నిజమే అయినా మన రాజకీయ నాయకులు ఈ అంశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో, దాని వలన దేశానికి అంతిమంగా ఎలా నష్టమో బహుసా ఆయన ముందుగానే ఊహించి ఉంటారు.
3.      మన దేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంగా జరిగిన వలసలలో లక్షల మంది చంపబడ్డారు, ఇంకెన్నో లక్షల మంది జీవితాలు సర్వ నాశనం అయిపోయాయి. అంతే కాకుండా వలస రాకుండా పాకిస్తాన్ లోనే ఉండిపోయిన హిందువుల జీవితాలు దుర్బరంగా మారిపోయాయి. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో 15% ఉన్న హిందువుల జనాభా (సిఖ్ఖులతో కలిపి) ప్రస్తుతం 2% గా ఉంది, బంగ్లాదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. అంబేద్కర్ గారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో హిందువులకి పట్టబోయే గతిని ముందుగానే ఊహించి ఒక క్రమ పద్దతిలో అక్కడి నుండి హిందువులు ఇక్కడికి, ఇక్కడినుండి ముస్లింలు అక్కడకి ప్రభుత్వాలే చేర్చాలి అని ప్రతిపాదించారు. మన దేశంలో ఉండబోయే ముస్లింల గురించి ఆందోళన పడక్కరలేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రతిపాదించినట్లు జనాభా బదిలీ జరిగి ఉంటె కొన్ని లక్షల ప్రాణాలు మిగిలేవి, కొన్ని కోట్ల మందికి కష్టాలూ తప్పేవి [3]
4.      అంబేద్కర్ గారు సంస్కృతాన్ని మన దేశ జాతీయ భాషగా చెయ్యాలి అని కోరుకున్నారు. తరువాతి కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమస్య తీవ్రతరం అవుతున్న కాలంలో కూడా హిందీని జాతీయ భాషగా అన్ని రాష్ట్రాలూ అంగీకరించాలని, హిందీ సహాయంతో దేశమంతా సాంస్కృతిక ఏకత్వాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు [1]
5.      పాకిస్తాన్ తో మనకి జరిగిన సింధు జలాల ఒప్పందం విషయంలో కూడా ఆయన దూర ద్రుష్టి ప్రసంశనీయం. సింధూ జలాలపై ప్రధమంగా హక్కు మనకే అని పాకిస్తాన్ ఒప్పుకుంటేనే కానీ వారికి సింధూ జలాలని ఇవ్వం అని ఆయన కరాఖండిగా చెప్పారు. నెహ్రు గారు ఆ సమయంలో రాజీ పడకపోయి ఉండి ఉంటే పరిస్తితి వేరేలా ఉండేది. [4]
ఆధునిక భారత దేశ చరిత్రలో అంబేద్కర్ గారు గొప్ప మేధావి, దేశ భక్తులు అనడంలో సందేహం లేదు. ఆయనని కేవలం ఒక దళిత నాయకుడిగా చూడటం ఆయన మేధస్సుని చిన్న చూపు చూడటమే అవుతుంది.

1. https://swarajyamag.com/ideas/the-ambedkar-they-dont-want-you-to-know-about
2. https://www.outlookindia.com/magazine/story/what-if-reservations-had-come-to-an-end-in-1960/224881
3.http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/ambedkar_partition/514.html#part_6
4. Unravelling the Kashmir Knot – by Aman M. Hingorani (పుఠ # 155)

Comments