Questions and Answers Dr Visalakshi , ప్రశ్నలు & సమాధానము డా.విశాలాక్షి

🙏💐 - ప్రశ్నలు -  💐🙏

1. స్వాహా !  ఇది మన నిత్య జీవితంలో భోజన, ఆచమన, పూజా సమయాల్లో చాలా సార్లు ఉపయోగిస్తాము
కేశావాయ స్వాహా మొదలైనవి అంటూ.
మరి ప్రాణాయ స్వాహా అని ఎందుకు అంటాము ? ఇది  మన భౌతిక దేహానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది ?

2. నమః అని కూడా అంటాము. కేశవాయ నమః, అలా. స్వాహా కి నమః కి తేడా ఏమిటి ? ఏ సమయంలో స్వాహా వాడాలి? ఏ సమయంలో నమః వాడాలి ?

3. పూజ చేసేప్పుడు  ఒకసారి స్వాహా అని, ఒకసారి నమః అనీ ఎందుకంటారు?

💐 - సమాధానము - 💐

పూజ చేయటానికి ఆచమనం చేసేటప్పుడు మగవారు స్వాహా కారంతోను, ఆడవారు నమః అంటూను జలం లోపలికి తీసుకుంటారు. ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా ... అలా పురుషులు, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః .... అంటూ స్త్రీలు ఆచమనం చేసి, పూజ చెయ్యాలి.

భోజన సమయంలో  'ప్రాణాయ స్వాహా అనట మెందుకు ? ఇది మన భౌతిక దేహానికి ఎలా ఉపయోగపడుతుంది ' ? అన్నదానికి  -

' దేహో దేవాలయః ప్రోక్తో
జీవో దేవస్సనాతనః ' !!

మన దేహమే భగవన్నివాస స్ధానము. మనలోపల పరమాత్మ ఉంటాడు.
మానవ దేహంలో భూమి, నీరు నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతాలు ఉన్నాయి. మన శరీరంలో జఠరాగ్ని రూపంలో వైశ్వానరాగ్ని ఉంటుంది. విశ్వం లోని నరులందరిలో ఉండే అగ్ని  వైశ్వానరాగ్ని. నరులందరిలో అంటే సర్వ ప్రాణికోటి లో !

మన దేహంలో ప్రాణశక్తి ప్రాణ,అపాన, వ్యాన, ఉదాన, సమానము లనబడే పేర్లతో  ఐదు రూపాలతో ఉంటుంది. ఈ ఐదు వాయురూప పరమాత్మ కి ఓం ప్రాణాయ స్వాహా అంటూ ఆహుతులు సమర్పించి, మిగిలిన భోజనము చెయ్యాలి. ఈ ఆహుతులు మనలోని పరమాత్మ కు సమర్పిస్తున్నాము కనుకే చూపుడువేలు తగలకుండా, అభికరించిన అన్నం మెతుకులను పలువరుసకు, పెదవులకు తగలకుండా నోటిలో వేసుకుని లోపలికి తీసుకుని పరమాత్మ కు సమర్పిస్తారు. పెదవులకి, పంటికి తగిలితే అది ఎంగిలవుతుంది. ఈ అన్నమే మన శరీరంలోని వైశ్వానరాగ్నికి సమర్పించే హవిస్సు. దీనివలన మనం భుజించే ఆహారం మొత్తం ప్రసాదమయి శరీరం మొత్తానికి భగవదనుగ్రహం తో శక్తి లభిస్తుంది.
మన భౌతిక దేహము పిండాండము. మనకు బైట కనుపిస్తున్నది బ్రహ్మాండము. బ్రహ్మాండంలో - విశ్వంలో ఉన్నదంతా మన దేహంలో ఉంది. మనలో ఉన్నదే బ్రహ్మాండమంతా ఉన్నది. మనం ఆహారం తీసుకునేటప్పుడు - పంచ ప్రాణ రూప వాయువులకు ఆహారం  సమర్పించేటప్పుడు, దైవారాధన చేసి నైవేద్యము సమర్పించినప్పుడు,  యజ్ఞయాగాదులు చేసి హవిస్సులు సమర్పించటం వలన మనకు పరమాత్మ తో అనుసంధానం జరుగుతుంది. మనలోని ఆత్మకు విశ్వాత్మతో అనుసంధానం జరుగుతుంది.
అండాండ బ్రహ్మాండాలు
సమన్వయింప బడతాయి, అనుసంధానించ బడతాయి. దాని వలన పరిమితమైన మన శరీరము యొక్క, మనస్సు యొక్క, జీవాత్మ యొక్క శక్తి అపరిమితత్వాన్ని పొందగలుగుతుంది.
ఇది అంతర్యాగములోని ఒక భాగము.

బహిర్యాగములో శాస్త్రోక్త ప్రకారము హోమకుంఢమును తయారు చేసి, ఋత్విక్కులు యజమాని దంపతులతో హోమము లేక క్రతువును నిర్వహింప జేస్తారు. ఆ సమయంలో ఒక్కొక్క దేవతనీ పేరుతో సాంగ సపరివారంగా ఆహ్వానించి, ఆహుతులను స్వాహాకారంతో సమర్పిస్తారు. స్వాహాదేవి వాటిని వారికి అందజేస్తుంది.

స్వాహా కు, నమః కు
గల తేడా ఏమిటంటే, అగ్నిలో ఏదైనా హోమ ద్రవ్య్రాన్ని వేసేటప్పుడు స్వాహా అంటూ సమర్పిస్తారు. నెయ్యి, నవధాన్యాలు, అన్నము, లాజలు, పురోడాశాలు,  పూర్ణాహుతి గా వేసే
హోమ ద్రవ్యాలు,
ఏవైనా సరే, అగ్ని లో ఆహుతులుగా సమర్పించేటప్పుడు ఆ  సమయంలో
పలికేటువంటి పదం
స్వాహా ! స్వాహా దేవి, స్వధాదేవి అగ్ని హోత్రుని భార్యలు. ఏ దేవతకు హవిస్సులు సమర్పించాలన్నా
ఆ దేవత పేరు చెప్పి స్వాహా అంటాము. అగ్నయే స్వాహా, అగ్నయే ఇదం, న మమ. ఇది అగ్నిహోత్రునికి సమర్పిస్తున్నాను. ఇది అగ్నిహోత్రునిది. నాది కాదు. ఇంద్రాయ స్వాహా, ఇంద్రాయ ఇదం, న మమ. ఇది ఇంద్రునికి సమర్పిస్తున్నాను. ఇది ఇంద్రునిది. నాది కాదు.  ఇలా అంటూ అగ్ని లో సమర్పించినప్పుడు అగ్ని దేవుడు దానిని తీసుకుని స్వాహా దేవికిస్తే, ఆవిడ దానిని ఆ దేవతకు అందజేస్తుంది.

శ్రాధ్ధకర్మలాచరించేటప్పుడు విశ్వేదేవతలను, పితృదేవతలను కూడా ఆవాహన చేస్తారు. విశ్వే దేవతలకు, పితృదేవతలకు కూడా  ఆహుతులను సమర్పిస్తారు. విశ్వేదేవథలకు బియ్యమును జలమును, పితృదేవతలకు నల్లనువ్వులను, జలమును సమర్పిస్తారు.  పితృదేవతలకు సమర్పించేటప్పుడు స్వధా అంటారు. వెంటనే అగ్నిహోతృడు దానిని స్వధా దేవికి ఇస్తాడు. ఆవిడ దానిని పితృదేవతలకు అందజేస్తుంది. యజమాని
దేవతలకు సమర్పించేటప్పుడు యజ్ఞోపవీతమును సవ్యముగాను, పితృదేవతలకు సమర్పించేటప్పుడు అపసవ్యముగాను ధరిస్తాడు. ఎందుకంటే అగ్ని హోతృనికి కుడిపక్కన స్వాహాదేవి, ఎడమ పక్కన స్వధాదేవి ఉంటారు.

యజ్ఞ సమయంలోను, అర్చనప్పుడు, మంత్ర జపం చేసేటప్పుడు,
నమః అనే పదము వాడతాము.
భగవంతునికి
నమస్కరిస్తున్నప్పుడు, పెద్దలకు నమస్కరించేటప్పుడు
పలికే పదము  నమస్కారము. నమస్కరించటము అంటే వారు మనకంటే గొప్ప అనీ, మనము వారికంటే తక్కువ అనీ, వారికి తలవంచి వినయంతో ఉంటామనీ చెప్పటము.
నమః అంటే జీవాత్మ కి  పరమాత్మ కి ఐక్యతని చెప్పటము.
భగవంతునికే కాకుండా,
సాటి వారికి కూడా
నమస్కారమండీ  ! అంటూ నమస్కరిస్తాము. అంటే వారిని గౌరవిస్తున్నామని తెలియజెప్పటము.
కనుక నమః అనేది ఆత్మ సమర్పణను, భక్తిని, వినయాన్ని,
గౌరవాన్ని సూచించే పదము.
దీనినే నమస్కారము
అంటాము.

ఓంకారము, స్వాహాకారము,  స్వధాకారము, వషట్కారము, నమస్కారములు ఐదింటినీ పంచ ప్రణవములంటారు.

పూజ చేసేటప్పుడు ఒకసారి స్వాహా అనీ, ఒకసారి నమః అనీ ఎందుకంటారంటే, ఆచమనం చేసేటప్పుడు స్వాహాకారంతో జలమును లోపలికి స్వీకరించినప్పుడు ఆ జలము మనలోని పరమాత్మకు సమర్పిస్తున్నాము. తరువాత భగవన్నామాలను చెప్తూ భక్తి తో నమస్కరిస్తూ, గంధమును, పసుపు కుంకుమలను, ధూపమును, దీపమును, అక్షతలను,  పుష్పములను, పత్రములను సమర్పిస్తాము. నైవేద్యము సమర్పిస్తాము. హారతినిస్తాము.  త్రికరణశుద్ధిగా భగవంతుని పూజిస్తాము.అంటే  ద్రవ్యములతో, వాక్కుతో,  మనస్సుతో అర్చిస్తాము. బాహ్య వస్తువులతో పూవులు మొదలైన వాటితో పూజించటం ద్రవ్యపూజ. నామములు పలకటము, స్తోత్రములు చదవటము, భజన చెయ్యటము వాచక పూజ, వాక్కుతో పూజించటము. మనస్సు లో పరమాత్మను ధ్యానించటం మానసిక పూజ. భక్తి శ్రధ్ధలతో, దీక్షతో, ఏకాగ్రతతో, భగవదనుగ్రహప్రాప్తి కొరకు చేసే పనులనే యజ్ఞము అంటాము. మన సనాతన ధర్మము యజ్ఞ సంస్కృతి. మన సనాతన ధర్మమును,  సత్సంప్రదాయములను పరమాత్మ రక్షించు గాక !

🙏🙏🙏💐🌹💐

డా.విశాలాక్షి.

Comments